వరంగల్: పట్టపగలు నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్య..చూస్తూ ఉండిపోయిన జనం, ఎందుకిలా?

ఫొటో సోర్స్, UGC/SCREENGRAB
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
వరంగల్లో ఓ ఆటోడ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. ఇదే మహిళతో సంబంధం ఉన్న మరో ఆటో డ్రైవర్ ఈ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
వరంగల్ పట్టణంలోని అదాలత్ జంక్షన్ సమీపంలో జనవరి 22న పట్టపగలే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో చుట్టుపక్కల జనాలు ఉన్నా దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు.
కళ్లముందే హత్య జరుగుతున్నా మనకెందుకులే అనే ధోరణిలో ఉండటం, సెల్ ఫోన్ లో వీడియోలు రికార్డ్ చేయడానికే ఎక్కువ మంది మొగ్గుచూపడం మనుషుల్లో క్షీణిస్తున్న సున్నితత్వం, అభద్రతాభావానికి నిదర్శనమని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SUBEDARI PS/ FACEBOOK
అసలేం జరిగింది..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
వరంగల్ మడికొండ ప్రాంతానికి చెందిన మాచర్ల రాజ్ కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఇద్దరూ ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వితంతువు (40)తో కొంతకాలంగా వీరిద్దరికి వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈనేపథ్యంలో మాచర్ల రాజ్కుమార్(38)పై ఏనుగు వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేయగా, రాజ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.


ఫొటో సోర్స్, SUBEDARI PS/ FACEBOOK
'వారం రోజుల ముందే కత్తి కొని...'
'ఆరు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సదరు మహిళకు హతుడితో మొదట సంబంధం ఉండేది. ఆ తర్వాత నిందితుడికి కూడా అదే మహిళతో సంబంధం ఏర్పడింది' అని సుబేదారి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి బీబీసీతో చెప్పారు.
'హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వెంకటేశ్వర్లు వారం రోజుల కిందట కత్తి కొని తన ఆటోలో దాచాడు. అదను కోసం వేచి చూశాడు.' అని ఇన్స్పెక్టర్ వివరించారు.
ఘటనా స్థలంలోనే నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు బీఎన్ఎస్ 103 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితుడు, హతుడు ఇద్దరూ పెళ్లయినవారే.

ఫొటో సోర్స్, DOCTOR VIKAS
‘ఏం జరిగితే నాకేంటి?’
బయటి వ్యక్తులకు ఏం జరిగితే నాకేంటి సంబంధం అనే ధోరణి మనుషుల్లో పెరుగుతోందని నిజామాబాద్ కు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ వికాస్ బీబీసీతో అన్నారు.
"తోటి మనుషులు, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తనకు బాల్యంలోనే బీజం పడాలి. దీనికి తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం తోడ్పడాలి. మధ్యలో వెళితే తనకేమన్నా అవుతుందేమో అనే అభద్రతభావం, ఒత్తిడి, మానసిక భయం, శారీరక బలహీనతలు కూడా వెనకడుగు వేయడానికి కారణం. అయితే, ఒక స్థాయి వరకు కచ్చితంగా నేరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఘటన రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాలనే ఆలోచిస్తున్నారే కానీ బాధ్యతగా ప్రవర్తించడం లేదు. కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోననే భయం కూడా మరో కారణం. ఇది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే'' అని డాక్టర్ వికాస్ అన్నారు.
''అక్కడ గుమిగూడిన వంద మంది భయంతో వెనకడుగు వేశారు. పోలీసులే వచ్చి ఆపాలనే ధోరణే వారిలో కనిపించింది. ఒకరిద్దరు ముందుకు వచ్చి నేరం నివారించగలిగితే కోర్టులు, పోలీసులు అనే పరిస్థితులే ఉత్పన్నం కావు కదా? సమాజం ఈ విషయం ఆలోచించాలి'' అన్నారు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి.

ఫొటో సోర్స్, UGC
నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పోలీసులు అంటున్నారు.
''కొన్ని సందర్భాల్లో పోలీసులు వెనువెంటనే చేరుకోలేకపోవచ్చు. ఆలోపు అక్కడున్న జనాలు వీలైన మేరకు నేరాన్ని ఆపగలిగితే ఆ తర్వాత పోలీసులు చూసుకుంటారు. నేరస్థలంలో ఉన్న వారందరినీ ప్రత్యక్ష సాక్షులుగా తీసుకోం. పోలీసులు అలా చేస్తారనుకోవడం తప్పు. ఇష్టపూర్వకంగా ముందుకువచ్చిన ఒకరిద్దిని మాత్రమే సాక్షులుగా తీసుకుంటాం. సాక్షులను బలవంత పెట్టే అధికారం పోలీసులకు లేదు. అయితే, సాక్ష్యం, సాక్షులు లేకపోతే నేరాలను ఎలా నివారిస్తాం? నేర నిరూపణ, శిక్ష పడేలా చేయడం కష్టం'' అని హన్మకొండ ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
'పోలీసులు ఇబ్బందిపెడతారనే అభధ్రతా భావం సరైనది కాదు. ఇలాంటి సమయాల్లో అయ్యో, పాపం అని జాలి ప్రదర్శించడం కంటే నేరం జరగకుండా ముందుకు రావడం ముఖ్యం. ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడి యువకులు రికార్డ్ చేసిన వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ఇది బాధాకరం. వారు నేరం చేస్తున్న వ్యక్తి దృష్టి మరల్చే ప్రయత్నం చేసి ఉండవచ్చు. మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి మాత్రమే ముందుకు వచ్చారు'' అని ఏసిపి దేవేందర్ రెడ్డి అన్నారు.
'సాక్షులకు రక్షణ'
కోర్టులో సాక్ష్యం చెబితే భవిష్యత్తులో నేరస్తుల వైపు నుండి ఇబ్బందులు కలుగుతాయనే భావన ప్రజలలో ఎక్కువగా ఉంది. అయితే నేర తీవ్రతను బట్టి సాక్షుల వ్యక్తిగత గోప్యత, భద్రత కల్పించే అంశాన్ని పోలీసు విభాగం, కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి.
'' సాధారణంగా ఒక కేసు విచారణలో బాగంగా కోర్టులో స్టేట్ మెంట్ రికార్డ్ చేసే వరకు సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ (పోలీసులు) వారిపై ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాక్షుల వివరాలు కూడా బయటకు వెల్లడించరు. కోర్టులు కూడా సాక్షులకు రక్షణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తుంటాయి. అన్ని కేసుల్లో సాక్షులకు బయటి నుండి హాని ఉండకపోవచ్చు. అరుదైన కేసుల్లో మాత్రం రక్షణ కల్పించాల్సి ఉంటుంది'' అని తెలంగాణ పోలీసు శాఖ కు చెందిన సీనియర్ అధికారి పి.రామారావ్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)