నందమూరి బాలకృష్ణ: వీరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై ఏపీ పోలీసుల అభ్యంతరం

నందమూరి బాలకృష్ణ

ఫొటో సోర్స్, Gopichand Malineni/Facebook

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ‘వీరసింహా రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల6వ తేదీన జరగాల్సి ఉంది. ఈమేరకు ఆ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం ఈ విషయాన్ని తెలియజేశారు.

వేదిక ఏర్పాట్లు

ఫొటో సోర్స్, UGC

ఒంగోలులోని ఏబీఎం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ వేడుక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వేదిక మార్చాలని పోలీసులు సూచించారు.

వేదిక మార్చే వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తాము అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. దాంతో ప్రస్తుతం ఏబీఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వాహకులు ఏర్పాట్లు నిలిపివేశారు.

వేడుక నిర్వహించే మైదానానికి సంబంధించి పోలీసులు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ‘వీరసింహా రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద అనిశ్చితి ఏర్పడింది.

అయితే ఏబీఎం మైదానంలో వేడుక జరగడం లేదని ఒంగోలులోని బాలకృష్ణ అభిమానులు చెబుతున్నారు. వేదికను మారుస్తున్నామని ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నామని సినిమా యూనిట్ తెలిపింది.

మలినేని గోపిచంద్ దర్శకత్వం వహించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల అవుతోంది. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. థమన్ సంగీతం అందించారు.

చిరంజీవి

ఫొటో సోర్స్, Director Bobby/Facebook

చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 13వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమాను కూడా ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మించింది. బాబీ దీనికి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించారు.

సంక్రాంతి సీజన్‌కు ఒకే ప్రొడక్షన్ సంస్థ నుంచి రెండు సినిమాలు విడుదల కావడం తెలుగు సినిమా చరిత్రలో తొలిసారని గతంలో నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఇవి కూడా చూడండి: