యుక్రెయిన్లో ఔషధాలకు లొంగని ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతున్నాయి?

- రచయిత, అబ్దుజలీల్ అబ్దురసులోవ్
- హోదా, బీబీసీ న్యూస్, కీయేవ్
కీయేవ్లోని ఫియోఫానియా ఆస్పత్రికి ఒలెక్సాండర్ బెజ్వర్కినీని తరలించినప్పుడు ఆయన బతకగలరని నమ్మింది అతికొద్దిమందే. 27 ఏళ్ల ఒలెక్సాండర్కు పొత్తికడుపులో తీవ్ర గాయమైంది. పిరుదులు చీలిపోయాయి. ఆయన రెండు కాళ్లు తెగిపోయాయి.
ఆయన గాయాలకు సాధారణంగా వాడే యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై డాక్టర్లు ఆశలు వదులుకున్నారు. .
యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాలు ప్రభావం చూపకుండా బ్యాక్టీరియా పరిణామం చెందడాన్నే యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) అంటారు. అలాంటివాటిపై యాంటీబయాటిక్స్ ప్రభావం ఏమీ ఉండదు.

యుద్ధం యుక్రెయిన్ను ఎలా మార్చిందంటే...
ఒకప్పుడు ఈ సమస్యకు దూరంగా ఉన్న ఒకే ఒక్క దేశం యుక్రెయిన్. ఎఎంఆర్ ఇన్ఫెక్షన్తో 2021లో ప్రపంచవ్యాప్తంగా 14లక్షలమంది చనిపోయారు. 2023లో బ్రిటన్లో యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు 66,730 నమోదయ్యాయి. అయితే యుద్ధం కారణంగా యుక్రెయిన్లో వ్యాధికారకాలను తట్టుకునే అనేక బ్యాక్టీరియాలు వ్యాపించినట్టు కనిపిస్తోంది.
యుద్ధగాయాలకు చికిత్స అందించే అనేక క్లినిక్లలో ఏఎంఆర్ కేసుల్లో బాగా పెరుగుదల కనిపిస్తోంది. ఫియోఫానియా ఆస్పత్రిలో చేరినవారిలో 80శాతం మందికిపైగా రోగుల ఇన్ఫెక్షన్లకు కారణమైన సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్ను తట్టుకోగలవని డిప్యూటీ చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ ఆండ్రీ స్ట్రోకన్ చెప్పారు.
విచిత్రమేంటంటే వైద్య కేంద్రాల నుంచే యాంటీబయాటిక్స్ను తట్టుకునే ఇన్ఫెక్షన్లు ఉత్పన్నమవుతాయి.
క్లినిక్లు, ఇతర వైద్యకేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వైద్యసిబ్బంది అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాప్తిని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే యుద్దంలో గాయపడ్డవారితో ఆస్పత్రులు నిండిపోతున్నాయి.


చికిత్సాకేంద్రాల నుంచే...
రష్యా ఆక్రమణ ప్రారంభమైన దగ్గరినుంచి కేవలం తన యూనిట్లోనే పడకల సంఖ్య 16 నుంచి 50కి పెంచినట్టు మెక్నికోవ్ ఆస్పత్రి ఐసీయూ హెడ్ డాక్టర్ వోలోదిమిర్ దుబీనా చెప్పారు. చాలా మంది ఉద్యోగులు యుద్ధ రంగం నుంచి పారిపోతుండడం, కొంతమంది తమంతటతాముగా మిలటరీలో చేరుతుండడంతో ఆస్పత్రిలో సిబ్బంది సంఖ్య తగ్గుతోంది.
ఎఎంఆర్ బ్యాక్టీరియా వ్యాప్తిపై ఈ పరిస్థితుల ప్రభావం ఉందని డాక్టర్ స్ట్రోకన్ చెప్పారు. ''శస్త్రచికిత్స విభాగాల్లో ఒక నర్సు 15 నుంచి 20 మంది రోగుల బాగోగులు చూడాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా ఉండడానికి అంతమందికి కావాల్సినస్థాయిలో ఆమె వైద్యసేవలందించే పరిస్థితి లేదు.యుద్ధం ప్రభావం ఎలా ఉంటుందంటే రోగులు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. యుద్ధం లేనప్పుడు ఇన్ఫెక్షన్ల వ్యాప్తి ఎక్కువ ఉండదు. వైద్యసేవల కోసం సైన్యం అనేక రకాల చికిత్సాకేంద్రాలకు వెళుతుంటారు. ప్రతిచోటా వారి ఏఎంఆర్ వ్యాపిస్తుంటుంది. యుద్ధం తీవ్రత దృష్ట్యా ఈ పరిస్థితిని నివారించలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్లే ఏఎంఆర్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది.
బెజ్వర్క్నీ కేసు విషయానికొస్తే కీయేవ్లోని ఆస్పత్రికి చేరుకునేముందు వరకు ఆయన మూడు వైద్యకేంద్రాల్లో చికిత్స పొందారు. సాధారణ వైద్యంతో ఆయన ఇన్ఫెక్షన్లు తగ్గించలేకపోవడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. ఐదుసార్లు ఆయనకు సెప్సిస్ సోకింది.

బెజ్వర్కినీని ఎలా రక్షించారంటే..
ఇటీవలి సంక్షోభాలతో పోలిస్తే ఇది భిన్నమైన పరిస్థితి. ఉదాహరణకు అఫ్గానిస్తాన్ యుద్ధంలో గాయపడ్డ పాశ్చాత్య దేశాల సైనికులను స్థానికంగా ఏర్పాటుచేసిన అనేక చికిత్సా కేంద్రాలకు తరలించడం కాకుండా యూరోపియన్ క్లినిక్కు విమానాలు, హెలికాప్టర్లలో తరలించేవారు.
యుక్రెయిన్ యుద్ధంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ రోగుల ప్రవాహం సాగుతోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఈ స్థాయిలో గాయపడ్డవారిని చూడలేదని డాక్టర్ దుబీనా చెప్పారు. డినిప్రో చుట్టుపక్కల ప్రాంతాల్లోని యుద్ధరంగంలో ఆయన ఆస్పత్రి ఉంది. అక్కడ రోగుల పరిస్థితి కాస్త మెరుగుపడగానే వారిని మరో క్లినిక్కు తరలిస్తారు. యుద్ధంలో గాయపడ్డవారిలో వీలైనంత ఎక్కువమందికి సాయమందించేందుకు వీలుగా ఇలా చేస్తారు.
''సూక్ష్మజీవశాస్త్రం ప్రకారం బ్యాక్టీరియా మరింతగా వ్యాప్తిచెందాలి. అలా జరగకపోతే మనం పనిచేయలేం. అది విపత్తుతో సమానం''
చాలామంది గాయపడుతుండడంతో బాధితులను ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి చికిత్స చేయడం యుక్రెయిన్ ఆస్పత్రుల్లో సాధ్యం కాదు. దీంతో అనేక యాంటీ బయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకర బ్యాక్టీరియా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటోంది.
బాధితులకు ప్రత్యేక యాంటీబయాటిక్స్తో చికిత్స అందించాలి. కానీ త్వరగా నయమయ్యే యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తుండడంతో వాటిని తట్టుకునే సామర్థ్యం బ్యాక్టీరియాకు పెరుగుతోంది.
అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూనే రోగిని రక్షించాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని డాక్టర్ స్ట్రోకన్ చెప్పారు. అదే సమయంలో యాంటీబయాటిక్స్ను తట్టుకునే సూక్ష్మజీవులు పుట్టకుండా చూసుకోవాలని తెలిపారు.
బెజ్వర్క్నీ కేసు విషయానికొస్తే...డాక్టర్లు ఆయనకు చాలా ఖరీదైన యాంటీబయాటిక్స్ ఉపయోగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి వాడారు. ఒక సంవత్సరం పాటు ఆస్పత్రిలో చికిత్స అందించి, వంద ఆపరేషన్లు జరిగిన తర్వాత ఆయన పరిస్థితి మెరుగుపడింది.
డాక్టర్లు ఆయన ప్రాణాన్ని రక్షించగలిగారు. అయితే యాంటీ బయాటిక్స్ను తట్టుకోగలిగే సూక్ష్మజీవులు పెరిగే కొద్దీ ప్రాణాలను రక్షించడం కష్టంగా మారుతుంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)